నిజామాబాద్ జిల్లాలో మరో రెండు ఆర్వోబీల నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందల్వాయి మరియు జానకంపేట్ గూడ్స్ షెడ్ ల వద్ద ఆర్వోబీల నిర్మాణాలను చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను, రైల్వే ఉన్నతాధికారులను కలసి పలుమార్లు విజ్ఞప్తులు అందించిన విషయం తెలిసిందే .
తాజాగా నిజామాబాద్ జిల్లాలో ప్రజల దీర్ఘకాలిక రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని హర్షిస్తూ, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలోని జాన్కంపేట్–నిజామాబాద్ వద్ద LC 190A, అలాగే ఇందల్వాయి–సిర్నాపల్లి మధ్య LC 198 ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణాలను “ స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్” కింద గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం, రైల్వే చట్టం -1989 లోని సెక్షన్ 2, క్లాజ్ (37 ఏ) ప్రకారం లభించిన అధికారాలను వినియోగిస్తూ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టును జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేంద్రం చేర్చడం ఎంతో ప్రాముఖ్యమైన నిర్ణయమని ఎంపీ గారు పేర్కొన్నారు.
ఈ నిర్ణయం ద్వారా తక్షణమే భూసేకరణ చేపట్టే అవకాశం కలుగుతుందని,పరిపాలన అనుమతులుత్వరితగతిన లభిస్తాయని,భూమి స్వాధీనం ప్రక్రియ వేగవంతం అవుతుందని, టెండర్లు, ప్రాజెక్ట్ అమలు వేగంగా పూర్తవుతుందని,కేంద్ర నిధుల సమీకరణ సులభమవుతుందని,ముఖ్యంగా ప్రజల భద్రత పెరిగి రైలు–వాహన ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఆయన తెలిపారు.అదేవిధంగా, ఈ ROBల నిర్మాణం పూర్తయ్యే ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గి, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడి, జిల్లా అభివృద్ధికి మరింత వేగం చేకూరుతుందని ఎంపీ గారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి గారు మాట్లాడుతూ, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కనీసం 10 ROBల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని పార్లమెంట్ స్థాయిలో నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత, ట్రాఫిక్ సౌకర్యం, మరియు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరిన్ని లెవెల్ క్రాసింగ్లను ROBలుగా మార్పిడి చేయించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తామని చెప్పారు.
అదనంగా, అమృత్ భారత్ కింద నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.53 కోట్లతో చేపడుతున్న పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు అందించే దిశగా ఈ పనులు త్వరలో పూర్తి కానున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల నిజామాబాద్ మీదుగా నడిచే పలు రైళ్లను స్పెషల్ రైళ్ల నుంచి రెగ్యులర్ రైళ్లుగా మార్చడం వల్ల ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగిందని ఆయన అన్నారు. దీనివల్ల రైలు సౌకర్యాలు స్థిరపడటంతో పాటు, జిల్లాకు రవాణా పరంగా మరింత బలం చేకూరుతుందని తెలిపారు.
ప్రజల అవసరాలను గుర్తించి ఈ ప్రాజెక్టులను “స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్” కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రైల్వే శాఖకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
