నగరంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. 25వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అంతరెడ్డి శ్వేత విజయపాల్ రెడ్డి తరఫున ఆదివారం ఉదయం 11 గంటలకు కోటగల్లిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళలు గాయాలపాలయ్యారు.
డప్పులతో ప్రచారం కొనసాగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆవులు అకస్మాత్తుగా బెదిరి మహిళలపైకి దూసుకురావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణభయంతో మహిళలు పరుగులు పెట్టగా, ఈ క్రమంలో రోడ్డుపక్కన ఉన్న మున్సిపాలిటీ నాలాలో పడిపోయారు.
ఈ ఘటనలో సావిత్రి (65) అనే మహిళకు కాలు విరగగా, మరో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
