మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అత్యంత కీలకమైన డివిజన్ల వారీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రాథమికంగా కొలిక్కి రావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మొత్తం 60 డివిజన్లలో ఏ స్థానం ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠకు తెర పడనుంది. నగరంలోని 60 డివిజన్లకు సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపులు ఇలా ఉన్నాయి: అన్ రిజర్వ్డ్ మొత్తం 30 స్థానాలు. ఇందులో జనరల్ 14, మహిళలకు 16 కేటాయించారు.
*బీసీ కేటగిరీ* : మొత్తం 24 స్థానాలు. ఇందులో జనరల్ 12, మహిళలకు 12 కేటాయింపు. *ఎస్సీ కేటగిరీ* : మొత్తం 5 స్థానాలు. జనరల్ 3, మహిళలకు 2 కేటాయించారు. *ఎస్టీ కేటగిరీ:* ఒక స్థానం (1) కేటాయించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఇప్పటికే ముసాయిదా జాబితా సిద్ధం చేసిన అధికారులు, ఈ నెల 16న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
ఈ జాబితా వెలువడిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను శాసించే శక్తిగా మహిళా ఓటర్లు నిలవనున్నారు. గణాంకాల ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. మొత్తం ఓటర్లు: 3,48,051, అందులోమహిళలు: 1,80,540, పురుషులు: 1,67,411, ఇతరులు: 44 ఉన్నారు.
*ఆశావహుల్లో ఉత్కంఠ* రిజర్వేషన్ల మార్పులపై ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. గతంలో పోటీ చేసిన స్థానాలు ఇప్పుడు జనరల్ లేదా మహిళలకు కేటాయిస్తే పరిస్థితి ఏంటని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. మేయర్, చైర్మన్ పీఠాల రిజర్వేషన్లు రాష్ట్ర స్థాయిలో ఖరారు కానుండగా, డివిజన్ల వారీగా స్థానిక కార్పొరేషన్ లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
16వ తేదీ తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయిలో ప్రచారానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
