సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిజామాబాద్ పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు వర్ని, కోటగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు వినూత్నంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు.
బోధన్ ఏసీపీ పర్యవేక్షణలో, రుద్రూర్ సీఐ మార్గదర్శకత్వంలో గురువారం జలాల్పూర్, కోటయ్య క్యాంప్, శ్రీనగర్, నెహ్రూ నగర్, హుమ్నాపూర్ మరియు జాకోరా గ్రామాల పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
మారుమూల ప్రాంతాలు, పొలాల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాలను డ్రోన్ల సాయంతో గుర్తించారు. పోలీసుల డ్రోన్ నిఘా సమాచారంతో జూదరుల్లో వణుకు మొదలైంది. గతంలో బహిరంగంగా సాగే పందాలు, డ్రోన్ల వినియోగం తర్వాత ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు.
పోలీసుల ఈ ముందస్తు చర్యల పట్ల స్థానిక ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వర్ని పోలీసులు హెచ్చరించారు.
ఎక్కడైనా కోడి పందాలు లేదా జూదం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా ‘డయల్ 100’కు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
