నిజామాబాద్, జనవరి 24 : రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి బాధ్యతతో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కలెక్టరేట్ లోని వీ.సీ హాల్ లో నోడల్ అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నోడల్ అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో ముందస్తుగానే సిద్ధమై ఉండాలని, అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని, ఏ దశలోనూ అలసత్వానికి తావివ్వకూడదని అన్నారు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా ప్రతి అధికారి బాధ్యతతో పని చేయాలని, శాఖల మధ్య సమన్వయం ఉండేలా చొరవ చూపాలని అన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహసిల్దార్లు పాల్గొన్నారు.
