జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్ లో భూసేకరణ అంశంపై సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారి పనులకు అవసరమైన భూసేకరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను చర్చించారు.
భూములు కోల్పోయిన వారికి అందించాల్సిన పరిహారం, ఇప్పటికే పూర్తయిన పరిహారం చెల్లింపులు, మార్కెట్ రేటు, భూమి అప్పగించడంలో జాప్యం జరుగుతున్న చోట అందుకు గల కారణాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల నిర్మాణాలు, విస్తరణ పనుల భూసేకరణ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
భూసేకరణ విషయంలో నెలకొని ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, జాతీయ రహదారి సంస్థకు భూములు స్వాధీనం చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని హితవు పలికారు. ఆర్మూర్ – మంచిర్యాల, మద్నూర్ – రుద్రూర్ – బోధన్ మార్గాల పనుల ప్రగతిని సమీక్షించారు.
ఈ సమావేశంలో బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ డీ-సెక్షన్ పర్యవేక్షకులు శ్రీనివాస్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
