జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.
13వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు, నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తదితరులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అలరించాయి. అనంతరం ప్రజలనుద్దేశించి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలకు, అమరవీరుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’తో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. వానాకాలం 2026కు గాను 5.58 లక్షల ఎకరాల సాగు లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశాం. రైతు భీమా కింద 487 మంది లబ్ధిదారులకు రూ. 24.35 కోట్లు, రైతు భరోసా కింద రూ. 219.16 కోట్లు జమ చేశాం.
జిల్లాలో 4,73,329 ఆహార భద్రత కార్డుల ద్వారా 15.95 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. రబీ సీజన్లో 7.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 1605 కోట్లు రైతులకు చెల్లించాం. సన్న వడ్ల బోనస్ కింద రూ. 299.71 కోట్లు పంపిణీ చేశాం. జిల్లాలో 16,843 ఇండ్లు మంజూరు చేయగా, రూ. 372 కోట్లు ఖర్చు చేశాం. నిన్ననే 2,764 ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఎస్.ఎస్.సి ఫలితాల్లో 94.24% ఉత్తీర్ణతతో జిల్లా మెరిసింది. నాలుగు కొత్త యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూ. 800 కోట్లతో మంజూరయ్యాయి. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచినట్లు వివరించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ. 393 కోట్ల రవాణా ఆదా అయ్యింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద సుమారు రూ. 281 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించాం.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
