నిజామాబాద్, ఫిబ్రవరి 07 : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విధులలో నిమగ్నం అయి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు సంబంధిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు ఐ.డీ.ఓ.సీ(కలెక్టరేట్)లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునేలా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు.
అదేవిధంగా బోధన్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు బోధన్ మున్సిపల్ కార్యాలయంలో, ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో, భీంగల్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఎన్నికల విధుల్లో నిమగ్నం అయి ఉన్న పోలీసు సిబ్బంది కూడా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని అన్నారు.
