మాజీమంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
బాన్సువాడలోని భారత్ గార్డెన్స్ లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సహ సభ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
బాన్సువాడ పాలిట పోచారం బకాసురుడు. ప్రజల పాలిట నరకా సురుడు అని నిప్పులు చెరిగారు.
పోచారం శ్రీనివాసరెడ్డిని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీ పుత్రుడు అని ప్రేమగా పిలిచే వారన్నారు. అయితే ఆయన లక్ష్మీ పుత్రుడు కాదని, శని పుత్రుడు అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
కేసీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంతో గౌరవించారని, తెలంగాణ తొలి మంత్రివర్గంలో ఆయనకు సముచిత స్థానం కల్పించారని, రెండో సారి అధికారం చేపట్టిన తరువాత అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
బాన్సువాడ నియోజకవర్గం కోసం పోచారం శ్రీనివాసరెడ్డి ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారన్నారు. ఇక్కడ కట్టించిన పదివేల ఇండ్లు కేసీఆర్ దయ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ను అడిగి ప్రతిరోజు ఏదో ఒక జీవో తీసుకున్న పోచారం
పార్టీ ఆపదలో ఉన్న సమయంలో కాంగ్రెస్ లో చేరి తీరని ద్రోహం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోచారం బాన్సువాడ సౌభాగ్యం కాదని ఇక్కడి ప్రజల దౌర్భాగ్యమని, తడిగుడ్డతో గొంతు కోసే రాక్షసుడని,
నమ్మినోళ్ళను నట్టేట్లో ముంచే నమ్మక ద్రోహి,అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టే వంచకుడు
అని ఆయన ఆరోపించారు.
తిన్నింటి వాసాలు లెక్కబెట్టే పోచారం లాంటి విశ్వాస ఘాతకులను ప్రజలు క్షమించరన్నారు.
క్రషర్లు, ఇసుక దందాలకు కక్కుర్తి పడి పార్టీ మారిన పోచారం తల్లి పాలు తాగి తల్లి రొమ్ముపైనే తన్నిన నీచుడని,
పోచారం తరచూ పార్టీలు మార్చే ఊసరవెల్లి అని, ఆయన పులి కాదని, తిన మరిగిన గండుపిల్లి
అని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.
పసుపు జెండా ఇంట్లో పెట్టి గులాబీ జెండా పట్టిండు. ఇప్పుడు గులాబీ జెండా వదిలి మూడు రంగుల జెండా పట్టిండు. జెండాలెన్ని మార్చినా అవినీతే పోచారం అసలు ఎజెండా అని ఆయన ఆరోపించారు.
త్వరలోనే బాన్సువాడ కు ఉప ఎన్నిక రావడం ఖాయమ న్నారు. పోచారం ఘోరంగా ఓడడం, డిపాజిట్లు కూడా గల్లంతు కావడం, ఊసరవెల్లి రాజకీయాలలో ఆరితేరిన పోచారాన్ని బాన్సువాడ ప్రజలు పంచె ఊడిపోయేలా ఉరికించి కొట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.