నూతన సంవత్సర వేడుకల ఆనందాన్ని ఆవిరి చేస్తూ, మద్యం మత్తులో రోడ్లపై అడ్డగోలుగా దూసుకెళ్లిన మందుబాబులకు నిజామాబాద్ పోలీసులు బ్రేకులు వేశారు.
డిసెంబరు 31 రాత్రి జిల్లా వ్యాప్తంగా ఉక్కుపాదంతో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 130 మంది వాహనదారులు పట్టుబడ్డారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఓ ప్రకటన విడుదల చేశారు.
వేడుకల పేరుతో వాహనాలు నడిపి, ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చే వారి పట్ల ఏమాత్రం ఉపేక్షించేది లేదని పోలీసులు నిరూపించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా బ్రీత్ అనలైజర్లతో కాపు కాశారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని అన్ని కీలక ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మందుబాబులు తప్పించుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు వారిని వదలకుండా పట్టుకున్నారు.
జైలు తప్పదు!సీపీ సాయి చైతన్య.. “ప్రమాదాల నివారణకే ఈ తనిఖీలు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ ప్రతి ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడమే కాదు, జైలుకు పంపడానికీ వెనుకాడం.
ప్రాణాలు తీసే ప్రమాదాలకు కారణమయ్యే వారి పట్ల మానవత్వం చూపాల్సిన అవసరం లేదు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.” అని తీవ్రంగా హెచ్చరించారు. పట్టుబడిన వాహనాలను సీజ్ చేసి, వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
