ప్రాణాలకు గండంగా మారిన చైనా మాంజాను విక్రయిస్తే సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ నగర కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం నగరంలోని రెండో టౌన్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి, నిషేధిత నైలాన్ మాంజాను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్ఐ ముజాహిద్ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఒక దుకాణంలో ప్రభుత్వంచే నిషేధించబడిన చైనా మాంజాను రహస్యంగా విక్రయిస్తున్నట్లు రెండో పట్టణ ఎస్ఐకి నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం సిబ్బందితో కలిసి ఆకస్మికంగా సదరు షాపుపై దాడి చేశారు.
ఈ దాడుల్లో ధారుగల్లీకి చెందిన మహమ్మద్ రహీకుద్దీన్, మహమ్మద్ ఫైజనుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు నిషేధిత మాంజాను అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో చైనా మాంజాను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే సంక్రాంతి పండుగ వేళ గాలిపటాల కోసం వాడే ఈ చైనా మాంజా పక్షులకే కాకుండా, ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.
ఇటువంటి ప్రాణాంతక మాంజాలను విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
