జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల ఆకలి తీర్చేందుకు సుభాష్ నగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం తమ ఉదారతను చాటుకుంది.
గత కొంతకాలంగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది కూడా అల్పాహార పంపిణీని కొనసాగిస్తూ సోమవారం నూతన కలెక్టరేట్ సముదాయంలో అభ్యర్థులకు పులిహోరను పంపిణీ చేశారు. దాత గుజరాతీ రాజేశ్వరి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఫోరం కార్యదర్శి డాక్టర్ విజయకుమార్ పర్యవేక్షించారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 11 గంటల నుంచే పులిహోర పంపిణీ చేపట్టారు. వీరికి తోడుగా రాజస్థానీ వాకర్స్ గ్రూపు వారు తాగునీటిని సరఫరా చేసి తమ వంతు సాయం అందించారు.
ఈ సేవా కార్యక్రమంలో ఫోరం సభ్యులు శ్రీరాములు, వెంకటరెడ్డి, లింగయ్య, దేవులానాయక్, రవీంద్రనాథ్, శ్రీనివాస్ అయ్యవార్, భూమయ్య, ధర్మరాజు, సత్యనారాయణ, దుర్గయ్య తదితరులు పాల్గొని పంపిణీని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా రాజస్థానీ వాకర్స్ గ్రూపు వారికి ఫోరం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
