విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను వేగంగా తొలగించి, విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యాధునిక ప్రూనర్ పరికరాలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని చాదర్ఘాట్ ఏఈ ప్రసాద్ తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు ట్రాన్స్కో, జెన్కో సీఎండీకి ఈ ఆధునిక పరికరాలను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రూనర్లతో చెట్ల కొమ్మలను తక్కువ సమయంలోనే సురక్షితంగా తొలగించడం సాధ్యమవుతోందని, దీంతో విద్యుత్ అంతరాయ సమయం గణనీయంగా తగ్గి, వినియోగదారులకు త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించగలుగుతున్నామని పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం అందిన ఫిర్యాదును చాదర్ఘాట్ ఏఈ కార్యాలయం వెంటనే స్వీకరించి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆధునిక ప్రూనర్ సాయంతో చెట్ల కొమ్మలను తొలగించి సమస్యను త్వరితగతిన పరిష్కరించినట్లు తెలిపారు.
దీంతో సాధారణ విద్యుత్ సరఫరాను అతి తక్కువ సమయంలోనే పునరుద్ధరించామని చెప్పారు.ఈ ఆధునిక పరికరాల వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది పనిభారం తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నామని, విద్యుత్ అంతరాయాల పరిష్కారంలో వేగం పెరిగిందని ఏఈ ప్రసాద్ వెల్లడించారు.
