రాష్ట్రంలో పౌరులకు, ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన, అవినీతి రహిత సేవలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రెవెన్యూ శాఖ ద్వారా జారీ చేసిన జీవో నం. 172 (తేదీ: 25.07.2026) ప్రకారం ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఒకే ధ్రువీకృత రికార్డులో అందుబాటులోకి రావడం వల్ల ప్రభుత్వ సేవలు పొందడంలో పారదర్శకత పెరుగుతుందని, కాలయాపన తప్పుతుందని హుస్సైనీ ముజీబ్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖల్లో తమ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, వారసత్వ సంబంధిత వివరాలు మరియు ఇతర అధికారిక ప్రయోజనాల కోసం పదే పదే సర్టిఫికెట్లు సమర్పించే బాధ తప్పి, ఒకే ధ్రువీకృత పత్రాన్ని వినియోగించుకునే సువర్ణావకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.
కేవలం ఉద్యోగులకే కాకుండా సాధారణ ప్రజానీకానికి కూడా ఈ విధానం ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు. పలు రకాల ప్రభుత్వ పథకాలు, సేవల కోసం వివిధ ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గిపోతుందని, ‘మీ-సేవ’ కేంద్రాల ద్వారా ఎంతో సులభంగా, త్వరితగతిన ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్’ పొందే వెసులుబాటు కలుగుతుందని వివరించారు.
ప్రజల కష్టాలను దూరం చేసేలా ఈ ప్రజాహిత నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వానికి టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
