పురుగుల మందు లభ్యం, ఆత్మహత్యగా అనుమానం..షాబాద్లో ఆరుగురి దారుణ హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ (29) సోమవారం మృతిచెందిన స్థితిలో కనిపించాడు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలోని ఓ వెంచర్లో స్థానికులు మృతదేహాన్ని గుర్తించి డయల్-100కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడిని రాజ్కుమార్గా నిర్ధారించారు.
మృతదేహం సమీపంలో పురుగుల మందు సీసా లభ్యమవడంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మరణానికి గల ఖచ్చితమైన కారణాలను పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలికను వేధించిన కేసులో తనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైందనే కక్షతో రాజ్కుమార్ శుక్రవారం అర్ధరాత్రి ఉన్మాదిగా మారి అరగంట వ్యవధిలోనే మూడు ప్రాంతాల్లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
తొలుత బాలిక తల్లి, నానమ్మపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకుని భార్యతో పాటు నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారుల గొంతులు కోసి హతమార్చాడు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడి కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చేపట్టారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై హోటళ్లు, లాడ్జీలు, దాబాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు.
సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులను ప్రశ్నించారు. ఈ క్రమంలో సోమవారం పెంజర్లలోని ఓ వెంచర్లో రాజ్కుమార్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి ఆధారాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, రాజ్కుమార్ మరణానికి గల కారణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
