శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ కలకలం రేపింది. రియాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్న అంతర్జాతీయ విమానాన్ని గగనతలంలోనే పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఈ-మెయిల్తో భద్రతా సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.
విమానాశ్రయం కస్టమర్ సపోర్ట్ విభాగానికి బాంబు బెదిరింపు సందేశం అందడంతో అధికారులు వెంటనే స్పందించారు. భద్రతా ప్రోటోకాల్ను అనుసరించి, రియాద్ నుంచి వస్తున్న ఆ విమానం కోసం అత్యవసర ఏర్పాట్లు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. విమానాన్ని ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ బేకు తరలించి, ప్రయాణికుల సామానుతో పాటు విమానంలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
గంటల తరబడి సాగిన సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని అధికారులు ధ్రువీకరించారు. ఇది కేవలం ఆకతాయిల పనిగా, ఫేక్ బాంబు బెదిరింపుగా నిర్ధారించడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఫిర్యాదు చేయగా, ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది దాని వెనుక ఉన్నది ఎవరు అనే అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేశారు.
