నిజామాబాద్ లోని మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ-193) నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం అదనపు నిధులను తక్షణమే మంజూరు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు.
సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్వోబీ పనుల పురోగతిపై చర్చించారు.
ఆర్వోబీ పనులకు సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం రూ. 8.68 కోట్ల అదనపు నిధులు గత 15 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల పనులు పూర్తి కావడంలో జాప్యం జరుగుతోందని మంత్రికి వివరించారు.
ఈ నిధులకు సంబంధించి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తే పనులు వేగవంతమవుతాయని ఎంపీ పేర్కొన్నారు. ఎంపీ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
అదనపు నిధులకు సంబంధించి వెంటనే మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నతాధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
