వ్యాపారవేత్తను వేధించేందుకు సొంతంగా వాతలు పెట్టుకున్న వైనం..నందిపేట పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు..సినిమా ఫక్కీలో ప్లాన్ వేశారు.. అమాయకులను ఇరికించి లక్షలు దండుకోవాలని చూశారు.. అందుకోసం ఏకంగా ఒంటిని కాల్చుకోవడానికి కూడా వెనుకాడలేదు.
కానీ, సాంకేతికత ముందు వారి తెలివితేటలు పారలేదు. తప్పుడు ఫిర్యాదుతో పోలీసులనే నమ్మించాలని చూసిన ‘కిలాడీ’ ముఠా గుట్టును నందిపేట పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం..
నందిపేట గ్రామానికి చెందిన పిప్పేర అంకిత, గంగాస్తాన్కు చెందిన అంబటి శ్రీనివాస్, సింగారం నవీన్లు కలిసి నిజామాబాద్కు చెందిన వ్యాపారవేత్త లోక ప్రతాపరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన నుంచి రూ. 30 లక్షలు వసూలు చేయడంతో పాటు, పాత కేసులను ఉపసంహరింపజేసుకోవాలని పథకం పన్నారు.
అయితే, ప్రతాపరెడ్డి వీరి బెదిరింపులకు లొంగకపోవడంతో దారుణమైన ‘డ్రామా’కు తెరలేపారు. అంబటి శ్రీనివాస్ డైరెక్షన్లో అంకిత సూచన మేరకు నవీన్ అనే యువకుడు అక్టోబర్ 4న ఆమెను బెల్టుతో చితకబాదాడు.
ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ అప్పట్లో అంకిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది సరిపోదన్నట్లుగా.. ఈ నెల 22న రాత్రి మరో ఘాతుకానికి పాల్పడ్డారు. గ్యాస్ స్టవ్ మీద స్టీల్ చెంచాలను వేడి చేసి, అంకిత తొడలపై నవీన్ వాతలు పెట్టాడు. ప్రతాపరెడ్డి మనుషులే తనను బంధించి ఈ హింసకు గురిచేశారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.
కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో అంకిత ఈ ప్లాన్ గురించి వేరొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండగా రికార్డ్ అయిన ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. ప్రతాపరెడ్డి ఈ రికార్డింగ్లను పోలీసులకు అందించడంతో కథ అడ్డం తిరిగింది.
శరీరంలోని గాయాలు కూడా కావాలని చేసుకున్నవేనని ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలడంతో నిందితులు నీళ్లు నమిలారు. పోలీసుల విచారణలో నిందితులు ముగ్గురూ తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
