కమిషన్ల కోసమే ఫైళ్లు పక్కన పడేశారా?: స్రవంతి రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇందూరు ప్రజలకు ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్, బైపాస్ రోడ్డు హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విమర్శించారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం ఇచ్చిన హామీపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడం అత్యంత దురదృష్టకరమని దినేష్ కులాచారి ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలు జిల్లా అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు.
హామీలు నిలబెట్టుకోలేనప్పుడు వారు పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ కార్యాలయం కోసం నగర నడిబొడ్డున స్థలాన్ని కేటాయించుకున్న నాయకులు, ప్రజల అవసరార్థం నిర్మించాల్సిన బస్టాండ్ కోసం మాత్రం స్థలాన్ని గుర్తించలేకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి ఓఆర్ఆర్ మంజూరు చేయించకపోతే, చరిత్రలో మహేష్ గౌడ్ దోషిగా మిగిలిపోతారని హెచ్చరించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన జిల్లా ఖమ్మంకు ఓఆర్ఆర్ తెచ్చుకోగలిగినప్పుడు, ఇక్కడి నాయకులకు ఆ దమ్ము లేదా అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి ప్రశ్నించారు. “ముఖ్యమంత్రికి, మహేష్ గౌడ్కు మధ్య కమిషన్ల బేరసారాలు కుదరకనే ఇందూరు ఓఆర్ఆర్ ఫైలును పక్కన పడేశారా?” అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. జిల్లా భవిష్యత్తును తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ నాయకులు, మేయర్, కార్పొరేటర్లు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్ నేతృత్వంలో జిల్లా అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం పోరాడుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకార్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
