మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిజామాబాద్ నగరంలో వేడిక్కింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి అగ్ర నేతల మధ్య మాటల మంటలు ప్రచారానికి మరింత సెగ పుట్టిస్తున్నాయి. శుక్రవారం నిజామాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నే లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. సీఎం రేవంత్ కౌంటర్ కు ఎంపీ అర్వింద్ శనివారం అంతే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నిజామాబాద్ స్మార్ట్ సిటీ విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. రేవంత్ రెడ్డికి కనీస జ్ఞానం లేదని, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. “రేవంత్ రెడ్డి.. చదువు, సంస్కారం లేకుండా మాట్లాడటం మానుకో.
ఏదైనా విషయంపై మాట్లాడే ముందు అవగాహన పెంచుకోవాలి. నీ పక్కనే పెద్ద చదువులు చదువుకున్న ఐఏఎస్ అధికారులు ఉంటారు, కనీసం వారిని అడిగినా స్మార్ట్ సిటీ ఎంపిక ప్రక్రియ గురించి చెప్పేవారు” అని అరవింద్ ఎద్దేవా చేశారు.
గతంలో కేంద్రం స్మార్ట్ సిటీల కోసం పట్టణాల పేర్లు అడిగినప్పుడు.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో నిజామాబాద్ పేరే లేదని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్కు అన్యాయం జరిగినందునే తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుని ‘అమృత్’ పథకాన్ని తీసుకువచ్చానని స్పష్టం చేశారు.
స్మార్ట్ సిటీలను ఎవరు ఖరారు చేస్తారో కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి ఎలా అర్హుడు?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నేను మోడీ జపం చేస్తున్నానని అంటున్నావు.. మరి నువ్వు సోనియా గాంధీ జపం చేయడం లేదా?” అని నిలదీశారు. ప్రధాని వద్ద తనకు ఎంత పరపతి ఉందో ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని, కానీ నిజామాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నానని తెలిపారు.
కల్వకుంట్ల కుటుంబం నుంచి డబ్బులు గుంజే పనిలో రేవంత్ నిమగ్నమయ్యారని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ ల్లో ఎక్స్పర్ట్ అని అరవింద్ ఆరోపించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో, ఒళ్లు పొగరెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ పార్టీలను వీణవాణితో పోల్చడం హేయమని, ఇది మానవత్వం అనిపించుకోదని ధ్వజమెత్తారు. “మురికి కాల్వలో పడేవారికి బుద్ధి ఉండదు. మానవత్వం లేకుండా రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం సరికాదని హితవు పలికారు.
