నిజామాబాద్, మే 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం తన చాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజాపాలన కార్యక్రమాలను చక్కగా నిర్వహించడం జరిగిందని, అదే స్పూర్తితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మరింత అట్టహాసంగా నిర్వహించేలా కృషి చేయాలన్నారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పోటోలు, ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాలను, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించేందుకు వీలుగా సమగ్ర వివరాలతో నివేదికలను అందించాలని ఆదేశించారు.
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా ప్రదర్శించేలా నివేదికలు ఉండాలన్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి స్టాళ్ళను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, శాఖల వారీగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.గీత, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, సీ.పీ.ఓ రతన్, డీ.పీ.ఆర్.ఓ ఎన్.పద్మశ్రీ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
