పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ అండగా నిలుస్తోంది. కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల నియామక పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, తెలిపారు.
కమిషనరేట్ పరిధిలోని ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ, అవసరమైన మార్గదర్శకత్వం అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని కమిషనర్ పేర్కొన్నారు. శిక్షణకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు డివిజన్లలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు.
నిజామాబాద్ డివిజన్ అభ్యర్థులకు మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ రూరల్ ఇంజినీరింగ్ కాలేజీలో, ఆర్మూర్ డివిజన్ అభ్యర్థులకు క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో, బోధన్ డివిజన్ అభ్యర్థులకు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజీలో పరీక్ష నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో పరీక్ష ప్రశాంతంగా, క్రమబద్ధంగా, పారదర్శకంగా సాగింది.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో అధికారులు పర్యవేక్షిస్తూ పరీక్ష ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.స్క్రీనింగ్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్ తదితర అంశాల్లో సమగ్ర ఉచిత శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నారు.
పోలీస్ కమిషనరేట్ అందిస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సాయి చైతన్య సూచించారు. క్రమశిక్షణతో శిక్షణ పొంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్తో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీటీసీ, ట్రాఫిక్, సీసీఎస్, ఏఆర్, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలకు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సీఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
