నగరంలోని రెండో కల్లు డిపోను ఆబ్కారీ అధికారులు సీజ్ చేయడం గీత కార్మికుల్లో కలకలం రేపింది. ఈ పంచాయితీ పీసీసీ చీఫ్ మహేష్ వద్దకు చేరింది. కొందరు డిపో లో వాటాల కోసం తెరవెనుక నడిపిన నిర్వాహకం నేపథ్యంలో డిపో అనూహ్యంగా మూత పడింది.
దీనితో ఆ డిపో చెందిన గీత కార్మికులు హుటాహుటి హైదరాబాద్ పీసీసీ చీఫ్ మహేష్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు దీనితో ఆయన సానుకూలంగా స్పందించడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు .
డిపో లో వాటాల మధ్య వివాదాల కారణంగా సోమవారం సాయంత్రం మూతపడిన ఈ డిపోను, రెండు రోజుల్లో పునఃప్రారంభింపజేస్తానని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భరోసా ఇచ్చారు. గత కొంతకాలంగా రెండో కల్లు డిపో భాగస్వాముల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి.
ఈ గొడవల నేపథ్యంలో డిపో నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విచారణ చేపట్టిన అధికారులు చివరకు డిపోను మూసివేయాలని నిర్ణయించడంతో నిన్న సాయంత్రం తాళాలు పడ్డాయి. డిపో మూతపడటంతో దానిపైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు 500 గౌడ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం రెండో సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు హైదరాబాద్లోని మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
తమ కులవృత్తిని నమ్ముకుని బతుకుతున్న వందలాది కుటుంబాలు డిపో మూసివేతతో వీధిన పడే ప్రమాదం ఉందని, తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు విన్నవించారుబాధిత గౌడ సోదరుల విన్నపంపై పీసీసీ అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు. వివాదాలను పరిష్కరించి, రెండు రోజుల్లోనే డిపోను తిరిగి తెరిపిస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రెండో సొసైటీ అధ్యక్షులు గొట్టిపాటి సత్యనారాయణ గౌడ్, కొయ్యడా శ్రీహరి గౌడ్, దుర్గా గౌడ్, అంజ గౌడ్, బసవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
