ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
విశిష్ట అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ…భారతీయ సంస్కృతిలో గురువులకున్న ప్రాధాన్యతను ఉటంకిస్తూ, తల్లిదండ్రుల తరువాత గురువులే విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే మహోన్నత శిల్పులు అన్నారు.
జ్ఞానం మాత్రమే కాకుండా విలువలు, నీతి, క్రమశిక్షణ, మానవత్వం గురువుల ద్వారానే విద్యార్థులు నేర్చుకుంటారని గుర్తు చేశారు.చరిత్రలో చాణక్య మార్గదర్శకత్వంతో చంద్రగుప్తుడు మహారాజుగా ఎదిగిన ఉదాహరణను ప్రస్తావించారు.
“గురువు చూపే మార్గదర్శకతే శిష్యుని సద్గుణవంతుడిగా, సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తీర్చిదిద్దుతుంది” అని మహేష్ గౌడ్ అన్నారు.
గత పదేళ్ల పాలనలో విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. 7.5 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం దెబ్బతిన్నదని తెలిపారు.టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, హెల్త్ కార్డు అమలు, స్కిల్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ కళాశాలలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టుతానని చెప్పారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపారమని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు.
అదే సమయంలో విద్యార్థులు చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండి, క్రీడలపై దృష్టి సారించాలని తల్లిదండ్రులకు సూచించారు.జిల్లా అభివృద్ధి, విద్యా ప్రగతికి నా వంతు కృషి కొనసాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ గారు సభా ముఖంగా తెలిపారు.
