ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ‘4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026’లో జిల్లాకు చెందిన పోలీస్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన సిబ్బందిని సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సాయి చైతన్య తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు ఈ క్రీడలు జరిగాయి. వివిధ క్రీడా విభాగాల్లో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది మొత్తం 20 పతకాలను కైవసం చేసుకున్నారు.
ఇందులో: బంగారు పతకాలు: 04 రజత పతకాలు: 07 కాంస్య పతకాలు: 09ఈ సందర్భంగా విజేతలకు మెడల్స్ అందజేసిన సీపీ మాట్లాడుతూ.. నిరంతరం విధులతో బిజీగా ఉండే సిబ్బంది, క్రీడల్లోనూ రాణించి జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.
భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావుతో పాటు పతకాలు సాధించిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
