పది నెలల పాటు పుస్తకాలతో యుద్ధం చేసి వార్షిక పరీక్షలు పూర్తి కావడంతో విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి.దీంతో పుస్తకాల భారానికి విరామం దొరికింది..ఇక ఆటపాటలకు సమయం ఆసన్నమైంది.
రోజురోజుకు భానుడి ప్రతాపం పెరుగుతున్న వేళ, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చిన్నారులు చెరువులు, బావుల బాట పడుతున్నారు. అయితే, ఈ సరదా కాస్తా అజాగ్రత్తగా ఉంటే విషాదంగా మారే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.
ఈ పాటికే చాలామంది చిన్నారులు నగరాలు,పట్టణాల నుంచి తమ అమ్మమ్మ, నానమ్మల ఊర్లకు పయనమయ్యారు. అయితే, ఎండ తీవ్రత దృష్ట్యా ఈ సెలవుల్లో పిల్లలు జలకాలాటల వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రాణాంతకం కాకముందే తల్లిదండ్రులు, సంరక్షకులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
గ్రామాలకు వెళ్లే పిల్లలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు స్థానిక చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్లడం సహజం. ముఖ్యంగా పట్టణాల నుంచి వెళ్లే పిల్లలకు నీటి లోతుపై అవగాహన ఉండదు. ఈత రాకపోయినా సరదా కోసం నీటిలోకి దిగి ప్రమాదాల బారిన పడుతుంటారు.
ఏటా వేసవిలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం నమోదవుతున్నాయి. పిల్లల చిన్ని సరదా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పిల్లలు ఈత కొట్టాలని పట్టుబడితే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా నీటి వనరుల వద్దకు పంపకూడదు. కచ్చితంగా ఇంటి పెద్దలు వెంట ఉండాలి. చెరువులు, బావుల్లో లోతు ఎంత ఉందో తెలియకుండా నీటిలోకి దిగనివ్వకూడదు.
పాచి పట్టిన మెట్లు, బురద ఉన్న చోట్ల జారిపడే ప్రమాదం ఉంటుంది. ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలకు అనుభవజ్ఞుల పర్యవేక్షణలోనే శిక్షణ ఇప్పించాలి. గాలి నింపిన ట్యూబులు లేదా లైఫ్ జాకెట్లు వంటి రక్షణ కవచాలను వాడటం శ్రేయస్కరం.
నీటిలో ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలో, ఇతరులకు ఎలా సమాచారం ఇవ్వాలో పిల్లలకు వివరించాలి. చిన్నారుల ప్రాణం ఎంతో విలువైనది. కాబట్టి సెలవుల వినోదం విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.
పల్లెల్లోని చెరువులు, బావుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు స్థానికులు నిరంతరం నిఘా ఉంచాలి.
