ఓటు హక్కు అనేది అమూల్యమైన వరం, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
బుధవారం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని 47వ డివిజన్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ఉదయం నుంచి పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో ,నమోదు కాకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేయడం అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి. ఓటింగ్ శాతం పెరిగితేనే జవాబుదారీతనం ఉన్న, పద్ధతి గల నాయకులు ఎన్నికవుతారు.
మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ నేతలు అభివృద్ధిని పక్కన పెట్టి, మతం పేరిట విద్వేషాలు రేపుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లోనూ బ్రహ్మరథం పడుతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 90 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని, నిజామాబాద్లో కూడా మేయర్ పీఠం దక్కించుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు విజ్ఞులని, అభివృద్ధికి ఆకాంక్షించే వారికే ఓటు వేస్తారని ఆయన పేర్కొన్నారు.
