అంగ (బీహార్), వంగ (పశ్చిమ బెంగాల్), కళింగ (ఒడిశా) రాష్ట్రాల తరహాలోనే త్రిలింగ దేశమైన తెలంగాణలోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ధీమా వ్యక్తం చేశారు.
ఆదివారం భాగ్యనగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతం కావడంపై ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సభను అశేష జనవాహినితో గ్రాండ్ సక్సెస్ చేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఇందూరు జిల్లా నుంచి ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివెళ్లి సభకు సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు.
మోదీ గర్జనతో తెలంగాణ కాషాయ సైన్యంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సభ రాష్ట్రంలో బీజేపీ అధికారానికి బలమైన పునాది వేయబోతోంది. పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని, బీజేపీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభ ద్వారా స్పష్టమైంది.
‘అబ్ కీ బార్ తెలంగాణ మే బీజేపీ సర్కార్’ అనే నినాదంతో ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ప్రధాని పిలుపునిచ్చినట్లుగా ‘వికసిత్ తెలంగాణ’ సాధనే మన అంతిమ లక్ష్యం కావాలి.తెలంగాణ భవిష్యత్తును మార్చడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని దినేష్ పటేల్ కులాచారి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
