ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా విరుచుకుపడిన పిడుగు.. ఇద్దరు రైతులకు గాయాలు కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం పిడుగుపాటు తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గాంధారి దుర్గం రోడ్డు సమీపంలోని సేవాలాల్ ఆలయంపై పిడుగు పడటంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది.
ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆలయానికి సంబంధించిన నిర్మాణంలో కొంత భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. ఇదే సమయంలో బొప్పాజీవాడ శివారులోని పత్తి చేలో పనిచేస్తున్న ఇద్దరు రైతులు కూడా పిడుగు ప్రభావానికి గురయ్యారు.
గ్రామానికి చెందిన సూర్యకాంత్, శంకర్ పొలంలో పనులు చేసుకుంటుండగా వర్షం ప్రారంభమైంది. దీంతో గొడుగు పట్టుకుని అక్కడే ఉన్న సమయంలో సమీపంలో పిడుగు పడింది. దాని ప్రభావంతో వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు పేలిపోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మండలంలో ఒకే సమయంలో పిడుగుపాటుకు ఆలయం దెబ్బతినడం, మరోచోట ఇద్దరు రైతులు గాయపడటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. వర్షం, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.
