సంక్రాంతి పండుగ వేళ కాసుల కక్కుర్తి కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వం కఠినంగా నిషేధించిన ‘చైనా మాంజా’ను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం..గౌతమ్ నగర్, కెనాల్కట్ట ప్రాంతాల్లోని గాలిపటాల దుకాణాలపై పోలీసులు మెరుపు దాడులు చేసి నిషేధిత మాంజాను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు ప్రమోద్ (గౌతమ్ నగర్)మహమ్మద్ యూనుస్ (గౌతమ్ నగర్), ఇప్ప సాయి తేజ (కెనాల్ కట్ట) ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి భారీ మొత్తంలో చైనా మాంజా దస్తీలను స్వాధీనం చేసుకుని, వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిబాబు వెల్లడించారు.
చైనా మాంజా పర్యావరణానికే కాకుండా, మనుషుల ప్రాణాలకు సైతం ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. గాలిలో ఎగిరే పక్షుల మెడలకు చుట్టుకుని అవి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ద్విచక్ర వాహనదారుల గొంతులకు తగిలి ప్రాణాంతక గాయాలవుతున్నాయి.
ఈ మాంజాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయించినా లేదా కొనుగోలు చేసినా కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు.
