ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో 48 గంటల పాటు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సహకారంతో ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్లను అరికట్టేందుకు ఏఐ కెమెరాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.బందోబస్తు కోసం 2,400 మంది పోలీస్ సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించినట్లు తెలిపారు.
భక్తుల భద్రత కోసం షీ టీమ్లు, క్రైమ్ టీమ్లను రంగంలోకి దించడంతో పాటు ఆలయాల వద్ద ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఆలయ ప్రాంగణాలు, ఊరేగింపు మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు లాల్దర్వాజా యూనియన్ బ్యాంక్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ క్రైమ్స్ శ్రీనివాస్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ ప్రభాకర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, డీసీపీలు శ్రీనివాస్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
