నగరంలో ఆదివారం నిర్వహించే ఊరపండుగ ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖిల్లా చౌరస్తా నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపు వివేకానంద విగ్రహం, గాజులపేట, గురుద్వారా, లక్ష్మీ మెడికల్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్నగర్, దుబ్బా వైపునకు కొనసాగనుంది.
దీంతో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బోధన్ వైపు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలను బైపాస్ మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ వాహనాలు ఆర్టీసీ బస్టాండ్ వెనుక నుంచి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, జడ్పీ చౌరస్తా, కంటేశ్వర్, మీ-సేవ, కంటేశ్వర్ బైపాస్, ఐడీఓసీ, అర్సపల్లి మీదుగా బోధన్ వైపు వెళ్లాలని సూచించారు.
అయితే హైదరాబాద్, బాన్సువాడ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తమ మార్గాల్లోనే ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. నగర ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
