ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్, ఆయిల్ చోరీ చేస్తున్న ముఠా గుట్టును ముగ్పాల్ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 10 కిలోల కాపర్ వైర్, రెండు వాహనాలు, చోరీకి ఉపయోగించిన పనిముట్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్తోపాటు పరిసర ప్రాంతాల్లో జరిగిన పలు ట్రాన్స్ఫార్మర్ చోరీలకు ఈ ముఠాతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.ఈ నెల 25న ఉదయం కంజర్ గ్రామ శివారులో ముగ్పాల్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముఠా సభ్యులను పట్టుకునిఅదుపులోకితీసుకున్నట్లు మోపాల్ ఎస్ఐ సుస్మిత తెలిపారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం..నిందితులు పగటిపూట గ్రామీణ ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లను రెక్కీ చేసేవారు. రాత్రివేళ టాటా జిప్, ట్రాలీ వాహనాల్లో అక్కడికి చేరుకుని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్, ఆయిల్ను అపహరించేవారని పోలీసులు తెలిపారు.
చోరీ చేసిన కాపర్ కాయిల్స్ను హైదరాబాద్లోని దక్కన్ ట్రేడర్స్కు చెందిన ఎం.ఏ. నఫే అన్సారీకి, కొన్ని సందర్భాల్లో కరీంనగర్కు చెందిన నూనె విష్ణుకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది.ముగ్పాల్, మాక్లూర్, డిచ్పల్లి, నవీపేట్, వర్ని, నిజామాబాద్ రూరల్, భీంగల్, జక్రాన్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన పలు ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసులతో నిందితులకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆయా కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల నుంచి అశోక్ లేలాండ్ వాహనం (TS 07 UB 7973), టాటా జిప్/ట్రాలీ (AP 07 TF 2920), కట్టర్, రెండు జతల గ్లౌవ్స్, వివిధ పరిమాణాల్లో 13 ఇనుప పానాలు, పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు ఎ. సురేశ్, డి. సాయినాథ్, హెడ్కానిస్టేబుల్ వెంకట్రామ్, కానిస్టేబుళ్లు ఆఫ్సర్, సర్దార్, వసీం, నరేశ్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.
