కలెక్టర్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠీతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలోని పెండింగ్ పనులు, నిధుల వినియోగంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రూ. 32 కోట్లతో చేపట్టిన యూఐడీఎఫ్ జంక్షన్ అభివృద్ధి పనులు, సోనీ ఫంక్షన్ హాల్ సమీప వంతెన, అర్సపల్లి ఆర్ఓబీ పురోగతిపై నివేదికలు కోరారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే ప్యాచ్ వర్కులు చేపట్టాలని సూచించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతులు, ఇందిరమ్మ ఇళ్లకు నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రూ. 5 కోట్ల ప్రత్యేక నిధులు, టీయూఎఫ్ఐడీసీ ఫేజ్-1, ఫేజ్-2 నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.
అలాగే రామార్తి చెరువు సుందరీకరణ, ప్రగతి నగర్ శ్మశాన వాటిక పనులు, ఐదు ఇంటర్నల్ పార్కుల నిర్మాణాలపై చర్చించారు. ఫూలంగ్ వాగు ఆక్రమణల తొలగింపుపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నగరంలోని బస్తీ దవాఖానాల పనితీరు, తల్లి-శిశు సంక్షేమ ఆసుపత్రిలో సౌకర్యాలపై సమీక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వేసవిపై ముందస్తు జాగ్రత్తలుఎండలు ముదురుతున్న నేపథ్యంలో నగరంలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు. అమృత్ 2.0 కింద చేపట్టిన యూజీడీ పనులు, నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు.
రంజాన్ పండుగ దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, సిగ్నల్స్ పనితీరు మెరుగుపరచాలని పోలీసు అధికారులకు సూచించారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి శాఖ వారం వారం పురోగతి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
కలెక్టర్ స్పందిస్తూ.. అభివృద్ధి పనులను తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తానని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
