నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత వేధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో సుమారు 4 లక్షల 15 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసారు, ఈ సాగుకు 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు కేవలం 25 వేల 580 మెట్రిక్ టన్నుల యూరియానే రైతులకు సరఫరా చేయబడినది.
ఇంకా సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. యూరియా దొరకక రైతులు సొసైటీలు, డీలర్ల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్నారనీ తెలిపారు. కొన్ని సొసైటీలకు ఇంకా యూరియా కేటాయింపులు లేకపోవడంతో రైతులు ముందుగానే డబ్బులు కట్టి యూరియా తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న యూరియా దొరకడం లేదనీ అన్నారు.
ప్రైవేట్ డీలర్లు, బడా రైతులు పెద్ద మొత్తంలో యూరియా కొనుగోలు చేయడం వల్ల చిన్నకారు, సన్నకారు రైతులకు యూరియా అందకపోవడం వలన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ ఆవేదన వ్యక్తంచేశారు.
యూరియా కొరతను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారనీ తెలిపారు. దీనివల్ల రైతులు అడ్డగోలు ధరలు చెల్లించలేక, కొనుగోలు చేసినా అది సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత వల్ల రైతులు వేసిన వరి పంట ఎదుగుదల మందగించడంతో రైతులు మరింత నష్టానికి గురికావాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.
కావున, జిల్లాలో యూరియా కొరత లేకుండా తక్షణమే రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కోరుతున్నాను. లేనిచో ఈ సీజన్లో వరి పంట దిగుబడి తీవ్రంగా తగ్గి, రైతుల జీవితాలు సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
