“ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని” మునిసిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ వద్ద అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం ఓటు ద్వారానే లభిస్తుందని, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓటు వేద్దాం – దేశాన్ని నిర్మిద్దాం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొని తమ నిబద్ధతను చాటారు. అనంతరం ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞను అధికారులందరూ కలిసి స్వీకరించారు.ఈ ర్యాలీలో మునిసిపల్ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
