మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాత పనులకే కొత్తగా భూమి పూజలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విమర్శించారు.
ఆదివారం ఆయన ఖలీల్ వాడిలో నిలిచిపోయిన ‘ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్’ పనులను, అలాగే అహ్మదీ బజార్లోని మార్కెట్ సముదాయాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల సౌకర్యార్థం మార్కెట్ పనులను సింహభాగం పూర్తి చేశామని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల అవి పూర్తికాక అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అహ్మదీ బజార్ మార్కెట్ దుస్థితి దారుణంగా ఉందని, కంపు కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు.నిధులు రాకపోతే నా సొంత ట్రస్ట్ ద్వారా నగరాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక్క ఇటుక కూడా కొత్తగా వేయలేదు” అని ఎద్దేవా చేశారు.గతంలో తాము తెచ్చిన రూ. 60 కోట్ల జీవోలను, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన రూ. 100 కోట్ల నిధుల జీవో పత్రాలను ఆయన మీడియాకు ప్రదర్శించారు.
గత రెండేళ్లలో ఈ ప్రభుత్వం తెచ్చిన నిధులు కేవలం రూ. 10 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు.నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, పోలీసులపైనే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్ హత్య, ఎక్సైజ్ కానిస్టేబుల్పై వాహనం ఎక్కించిన ఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శంబుని గుడి పక్కన దుకాణాల తరలింపుపై ఆందోళనలు చేసి అభివృద్ధిని అడ్డుకున్న నేతలు, నేడు అధికారంలో ఉండి కూడా వారిని కొత్త మార్కెట్లోకి ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
