తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నదని తెలంగాణ ఉద్యమాల సారధి, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం. కోదండరాం తెలిపారు.
మిలియన్ మార్చ్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని గన్ పార్క్ వద్ద నిర్వహించారు. వివిధ ఉద్యమ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు ఆత్మగౌరవంగా తలెత్తుకొని తిరిగే విధంగా వారికి తగిన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మిలియన్ మార్చ్ రోజు తెలంగాణ ప్రజలు చూపిన ఐక్యత, ధైర్యం రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆ రోజు తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన సాహసం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కొనియాడారు.
శాసనమండలి సభ్యుడు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం శాసనమండలిలో తప్పకుండా మాట్లాడతానని, ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశంపై కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. కోదండరాం గారితో పాటు తనపై కూడా ఈ బాధ్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటేశ్వరరావు, కే. గోవర్ధన్, వి. సంధ్య మాట్లాడుతూ మిలియన్ మార్చ్ రోజున న్యూ డెమోక్రసీ పార్టీ పోషించిన పాత్ర కీలకమైందని, ట్యాంక్బండ్ పైకి వెళ్లేందుకు పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఉద్యమానికి నూతన స్ఫూర్తిని అందించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ తెలంగాణ ఉద్యమకారుల సంఘాల నాయకులు ప్రపూల్ రామ్ రెడ్డి, డాక్టర్ చీమ శ్రీనివాసరావు, సుల్తాన్ యాదగిరి, ఓరుగంటి ఆనంద్, అశ్వద్ధామ రెడ్డి, దేశాయ్ కరుణాకర్, కాచం సత్యనారాయణ, పాండు, శ్యాంసుందర్, తెలంగాణ జన సమితి నాయకులు బైరి రమేష్, ఎం. నరసయ్య, పల్లె వినయ్, లక్ష్మారెడ్డి, శంకర్ రావు, రమేష్ ముదిరాజ్, ఆశప్ప, హనుమంత్ రెడ్డి, జస్వంత్, పేరాల ప్రశాంత్ కొత్త రవి, పుష్ప నీల, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమకారులు తరలివచ్చి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
