తేజస్వి హిందూ రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్పంతో, మాతృశక్తిని సంఘటితం చేస్తూ ఇందూర్ నగరంలో రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘పథ సంచలన్’ కన్నుల పండువగా సాగింది. సమితి స్థాపితమై 89 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఏకరూప గణవేష్ ధరించిన సేవికలు కదం తొక్కుతూ నగర వీధుల్లో నిర్వహించిన ఈ కవాతు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మాణిక్ భవన్ నుండి ప్రారంభమైన ఈ పథ సంచలన్ శివాజీ మహారాజ్ చౌరస్తా, శిశుమందిర్ రోడ్, పెద్ద బజార్ మీదుగా సాగింది.
ఈ క్రమంలో కోటగల్లి ప్రాంతానికి చేరుకున్న సేవికలకు హిందూ బంధువులు బ్రహ్మరథం పట్టారు. పల్నాటి కార్తీక్ కుమార్ – తేజశ్రీ దంపతులతో పాటు విఘ్నేష్, ఆరుష్, జగన్, రాకేష్, రాంచందర్ తదితరులు సేవికలపై పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం నినాదాలతో కోటగల్లి మారుమోగింది.
అనంతరం మానిక్ భవన్లోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల ఆవరణలో సార్వజనికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మాతృ సమాజమే దేశానికి మూలస్తంభమని, వ్యక్తిత్వ నిర్మాణమే ధ్యేయంగా సమితి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, దేశభక్తి కలగలిసిన సేవికల ప్రదర్శన మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖులు, హిందూ బంధువులు తమ కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
