నగరంలోని కోటగల్లీ, మార్కండేయ మందిరం సమీపంలో శుక్రవారం ఉదయ ఘోర అగ్ని ప్రమాదం సంభవించి కలకలం సృష్టించింది. సమాచారం ప్రకారం, ఒక ఇంట్లో ఉన్న దీపం ప్రమాదవశాత్తూ తిరగబడిన కారణంగా మంటలు చెలరేగాయి. పక్కనున్న మరొక ఇంటికి వ్యాపించి, క్షణాల్లోనే రెండు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ దుర్ఘటనలో మధిర ప్రసాద్, సుమలత అనే ఇద్దరి ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, గృహోపకరణాలు, ముఖ్యమైన పత్రాలు అన్నీ మంటల్లో కాళీ బూడిదయ్యాయి ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునే సమయానికి మంటలు తీవ్రంగా వ్యాపించాయి. గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
ఈ అగ్ని ప్రమాదంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, బాధిత కుటుంబాలను సాంత్వన పరిచారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు. ఇది మరికొద్దిగా ఆలస్యం జరిగి ఉంటే పక్కనున్న ఇళ్లు కూడా మంటలకు గురయ్యే అవకాశం ఉండేదని అధికారులు తెలిపారు.
