రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని కనీసం ఇప్పటివరకు కార్యచరణ కూడా చేపట్టలేదనీ కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ చేశారు.శనివారం నగరంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 27 న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేదావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని, తెలంగాణ భవిష్యత్ కు దిశా నిర్దేశం చేసేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిన్న గురువారం సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పై చర్చకు రావాలని సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సీఎం మాటలు కోటలు దాటుతున్నాయని, ప్రకటనలు మొదటి పేజీలో ఉన్న పథకాలు మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు.కావున ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఆ తరువాత చర్చకు రావాలని సవాల్ చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి నాలుగు వందల రోజులు దాటినా ఏమీ చేయలేదన్నారు. ఇక బీఆర్ ఎస్ పాలన పై విసుగెత్తిన ప్రజలకు మార్పు తెస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విస్మరించిందని అన్నారు.
అలాగే ప్రభుత్వ తీరు పై మేధావులు విసుగెత్తారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రగతి వేగంగా సాగుతుందని ప్రజలు గుర్తించాలన్నారు.
తెలంగాణ సమస్యలపై బీజేపీ పోరాటంతెలంగాణలో నెలకొన్న సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, కౌలు రైతులకు రూ.12 వేలు, దళితులకు రూ.12 లక్షల సాయం చేస్తామని చెప్పారని, ఆ హామీలు ఎటు పోయాయని ప్రశ్నించారు.
ఎంతో ఆశతో గెలిపించిన ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందనీ తెలిపారు.అలాగే ఇందుర్ ప్రజల మూడు దశాబ్దాల పసుపు బోర్డు కలను నెరవేర్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
బోర్డును సాధించడంలో ఎంపీ అర్వింద్ కృషి ఎంతో ఉందన్నారు. రానున్న రోజుల్లో పసుపు రైతులకు మేలు చేసే కార్యచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. బీసీ కులగణనకు బీజేపీ అనుకూలమని తెలిపారు.
కానీ ముస్లింలను బీసీలలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని దీనిపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు, సీఎం, పీఎం కాగలుగుతారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్క బీసీనైనా ముఖ్యమంత్రిని చేసిందా అని ఆయన ప్రశ్నించారు.
