కల్యాణ ఘడియ కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్న భక్తజనం రాముడిని పెండ్లి కుమారుడిగా, సీతమ్మ తల్లిని పెండ్లికుమార్తెగా దర్శనం చేసుకోవడానికి భక్తజనం తరించారు.
కన్నార్పితే కమనీయమైన ఆ దృశ్యం చూడలేమని భక్తులు ఒళ్లంతా కళ్లు చేసుకుని రామయ్య, సీతమ్మల కల్యాణాన్ని తిలకించారు.
పచ్చని పందిళ్లు కల్యాణానికి గొడుగు పట్టయి. అరటి ఆకులు, మామిడి తోరణాలు ఆ రాములోరి కల్యాణానికి శోభనిచ్చాయి.నిజామాబాద్ పట్టణంలో అతి పురాతన ఖిల్లా రఘునాథాలయంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. భక్తులకు సీతారామ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రెండు కనులూ చాలలేదు.
అర్చకస్వాముల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఒడిలో ఓలలాడించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగింది.
దాదాపు జిల్లాలోని ప్రతి రామాలయంలో కల్యాణాలు వైభవోపేతంగా సాగాయి. ప్రత్యేక వేదికలపై కొలువుదీర్చిన రామయ్య, సీతమ్మల ఉత్సవ మూర్తులు నూతన వధూవరులుగా భక్తులను కటాక్షించారు. స్థానిక ప్రముఖులు కల్యాణోత్సవాలకు హాజరయ్యారు.
ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని రామాలయాలకు వెళ్లి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి, దర్శనం చేసుకుని కొన్నిచోట్ల కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. అన్నిచోట్ల భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు.
అనంతరం అన్ని ప్రముఖ ఆలయాలు, కల్యాణ మూర్తులను రథంపై కొలువుదీర్చి శోభాయాత్రలు, గ్రామోత్సవం నిర్వహించారు.
