రైతుల నడ్డి విరిచి విత్తన కంపెనీలకు మేలు చేసే విదంగా కేంద్రం ముసాయిదా ఉందని రైతు సంక్షేమ కమీషన్ మెంబెర్ గడుగు గంగాధర్ ధ్వజమెత్తారు. విత్తన వ్యాపారాన్ని మరింత సరళీకృతం చేసేలా ఉంది కానీ దేశానికి వెన్నెముక అయినా రైతులకు అండగా నిలిచేదిగా లేదనీ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన విత్తన చట్ట ముసాయిదాను ప్రజల ముందు ఉంచింది కానీ ఈ నెల 11 వ తేదీ వరకు అభిప్రాయాలు చెప్పాలని కోరిందన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కొత్త విత్తన చట్టం తీసుకవస్తున్నామని ప్రకటించిందనీ అన్నారు. విత్తనాల రిజిస్ట్రేషన్, విత్తన కంపినీల లైసెన్స్, ఇతర అన్ని కీలక అధికారాలు కేంద్రం చేతిలో ఉంటాయి.
రాష్ట్రాల చేతులు కట్టివేసి అమలును పర్యవేక్షించమనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. రైతు సంక్షేమానికి అడ్డంకి. అత్యవసర పరిస్థితులలో తప్ప విత్తనాల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వాలకు లేదనీ స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి విత్తనాల చట్టం తెచ్చి ధరలను నియత్రించింది. ఇప్పుడు ఈ అధికారాలు రద్దు అవుతాయి.
నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాల వలన రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే నియమాలు ఈ బిల్లులో లేవు. నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇప్పించని చట్టం వలన ఏమి ప్రయోజనం. విదేశాలలో ఉత్పత్తి చేసిన విత్తనాలను మన దేశంలో విక్రయించడానికి అనుమతి ఇవ్వడం వలన సాగు రంగానికి నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మూడు నుండి ఐదు లక్షల మంది రైతులు విత్తన సాగు చేస్తున్నారనీ పేర్కొన్నారు.
