అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
శుక్రవారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 91 మంది లబ్ధిదారులకు సంబంధించి రూ. 23,07,000 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైద్యం కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
క్యాంపు కార్యాలయానికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఎటువంటి జాప్యం లేకుండా సెక్రటేరియట్కు పంపిస్తున్నామని, తద్వారా త్వరగా నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నామని వివరించారు.
బాధితులు ఆసుపత్రిలో ఖర్చు చేసిన మొత్తంలో కనీసం సగం మొత్తాన్ని ప్రభుత్వం సహాయ నిధి ద్వారా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా తన వంతు పోరాటం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు న్యాలం రాజు, ఇల్లేందుల ప్రభాకర్, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
