మున్సిపల్ నగారా మోగినా వీడని సందిగ్ధం
అయోమయంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం..
జిల్లాలో హీటెక్కిన పొలిటికల్ సీన్.. గెలుపు గుర్రాలపైనే పార్టీల నజర్
మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది.. కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. జిల్లాలోని పురపాలికల్లో ఎన్నికల సందడి మొదలైనా, పార్టీల అభ్యర్థుల ఖరారులో జరుగుతున్న జాప్యం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
షెడ్యూల్ వెలువడి, నేటి నుంచి నామినేషన్ల కూడా ప్రారంభం కావడంతో ‘బి-ఫామ్’ ఎవరికి దక్కుతుందో తెలియక ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రతి వార్డులోనూ నలుగురు ఐదుగురు అభ్యర్థులు రేసులో ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీల అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. “టికెట్ నాదే.. ప్రచారం చేసుకోండి” అని ఇప్పటివరకు లోకల్ లీడర్లు ఇచ్చిన హామీలు ఇప్పుడు నీటి మూటలయ్యేలా కనిపిస్తున్నాయి.
టికెట్ ఆశించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఖర్చు పెట్టిన నేతలు, తీరా ఇప్పుడు పేర్లు ఖరారు కాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. అటు క్యాడర్ కూడా ఎవరి వెనుక నడవాలో తెలియక అయోమయంలో ఉంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు పార్టీల జిల్లా ముఖ్య నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఒక్కొక్కరికి టికెట్ ఇస్తే.. మిగిలిన వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారేమోనన్న ఆందోళన నాయకుల్లో కనిపిస్తోంది.
దీంతో ‘వేచి చూసే ధోరణి’ అవలంబిస్తూ ఆఖరి నిమిషంలో పేర్లు ప్రకటించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఒకవైపు పార్టీల అంతర్గత కుమ్ములాటలు, మరోవైపు ప్రత్యర్థుల ఎత్తుగడలతో జిల్లా రాజకీయం సెగలు పుట్టిస్తోంది.
టీ కొట్లు, కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా మున్సిపల్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. “మా వార్డులో ఫలానా వ్యక్తి వస్తేనే గెలుస్తాం” అని కొందరు, “పార్టీ గుర్తు ఉంటే చాలు ఎవరైనా ఒకటే” అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే పార్టీలు అధికారికంగా జాబితాలు విడుదల చేయాల్సిందే.
