జిల్లా కేంద్రంలోని గోపాల్ బాగ్ ప్రాంతంలో ఉన్న పురాతన శివాలయంపై దుండగులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాలపై దాడులు పెట్రేగిపోతున్నాయని ధ్వజమెత్తారు.
“హిందూ సమాజం ఓపికను పరీక్షిస్తే, ఒక్కసారి కాషాయ దళం రెచ్చిపోతే జరిగే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం, శాంతిభద్రతల విభాగమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు.నగరంలోని గోపాల్ బాగ్ గోశాల ఆవరణలో ఉన్న పురాతన శివాలయంపై మూడు రోజుల క్రితం జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనపై పోలీసులు స్పందించిన తీరును ఎమ్మెల్యే విమర్శించారు.
నిందితులను పట్టుకోవడంలో యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. 80 ఎకరాల విస్తీర్ణమున్న గోశాల స్థలంలో కొందరు అక్రమంగా కబ్జాలకు పాల్పడ్డారని, దీనిపై కలెక్టర్, రెవెన్యూ అధికారులు తక్షణమే విచారణ జరిపి కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
“150 ఆవులు ఉన్న ఈ గోశాలలో దేవతా విగ్రహాలకే భద్రత లేకపోతే, రేపు గోమాతలకు ఏదైనా జరిగితే బాధ్యులెవరుఅని ఆయన ప్రశ్నించారు. సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ నినాదంతో అన్ని వర్గాలను సమానంగా చూసేది ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఆలయాలపై దాడులు, లవ్ జిహాద్ వంటి ఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ కమిషనర్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
