కరీంనగర్ టూ టౌన్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ శనివారం అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భార్య దివ్య మరణించిన ఐదు రోజులకే ఆయన కూడా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భార్య మరణాన్ని జీర్ణించుకోలేక, తీవ్ర మానసిక వేదనతో ఆయన ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ హృదయ విదారక ఘటనతో ఆ కుటుంబంలో చీకట్లు ముసిరాయి. ఐదు రోజుల వ్యవధిలోనే అటు తల్లిని, ఇటు తండ్రిని కోల్పోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
అప్పటివరకు అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు కళ్లముందే లేకుండా పోవడంతో చిన్నారుల రోదనలు అక్కడి వారిని కన్నీరు పెట్టించాయి.సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
