జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని పోలీస్ అధికారులతో ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసుల పురోగతి, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘అరెవ్ అలైవ్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని సీపీ స్పష్టం చేశారు.
ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరేలా చూడాలన్నారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.
నగరంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్లు, ఆర్థిక నేరాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ హెచ్చరించారు. సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. నకిలీ పత్రాల తయారీదారులపై నిఘా ఉంచాలి. ప్రజల్లో డిజిటల్ లావాదేవీలపై అవగాహన సదస్సులు నిర్వహించాలి.
రోడ్డు ప్రమాదాల నివారణకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉంటే సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని సరిదిద్దాలి” అని సీపీ పేర్కొన్నారు.
అంతేకాకుండా, ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్లపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఇన్చార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ సీఐ అంజయ్య, వివిధ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
