ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, కార్యకర్తల ఆశయాలకు వేదికగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన పరిపాలన సౌధానికి అంకురార్పణ జరిగింది.
బుధవారం నగరంలోని ఆర్ అండ్ బీ కార్యాలయ స్థలంలో పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ కలిసి భూమి పూజ నిర్వహించారు.
శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పునాది రాయి వేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్ల కాలంలోనే అద్భుత ప్రగతి సాధించామని పేర్కొన్నారు.
“రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది కాలంలోనే 4 లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు అప్పగించాం. కేసీఆర్ పాలనలో తెలంగాణ 50 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ప్రజలను ఊరించి మోసం చేసిన గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ, ప్రతి హామీని నెరవేరుస్తున్నాం” అని ఆమె స్పష్టం చేశారు.
తనకు తుపాకీ పట్టడమే కాదు, ప్రజల కోసం కలం పట్టి అభివృద్ధి చేయడం కూడా తెలుసని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ చేతుల మీదుగానే ప్రారంభం: మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశం మొత్తం రాహుల్ గాంధీ నాయకత్వం వైపు చూస్తోందని అన్నారు.
ప్రధాని పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప చరిత్ర ఆయనదని కొనియాడారు. “వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు సాధించడం ఖాయనన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మొలకెత్తే అవకాశం లేదు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.
నిజామాబాద్ జిల్లా కార్యాలయాన్ని రాహుల్ గాంధీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకే నమూనాతో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
