ఘనంగా 136వ మే డే వేడుకలు.. 140 అడుగుల జెండాతో భారీ ప్రదర్శన..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాస్తూ, యజమానులకు కొమ్ముకాసేలా ఉన్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య విమర్శించారు.
మే డే వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 1886 చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తితో 1920లో ఏర్పడిన ఏఐటీయూసీ, బ్రిటిష్ పాలకులతో పోరాడి 8 గంటల పని దినాన్ని, పని భద్రత చట్టాలను సాధించిందని ఓమయ్య గుర్తు చేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వీటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం అంటే కార్మికులను మళ్లీ బానిసత్వంలోకి నెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఏడుగురు సభ్యులు ఉంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్యను 250కి పెంచి కార్మికుల గొంతు నొక్కేస్తున్నారని ఆయన విమర్శించారు. పనిగంటలను 12 గంటలకు పెంచుతూ, వేతనాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. శ్రమకు తగ్గ ఫలితం కోసం, చట్టబద్ధమైన హక్కుల రక్షణ కోసం కార్మిక వర్గం మరోసారి చికాగో పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి నుంచి 140 అడుగుల భారీ ఏఐటీయూసీ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్, ఖలీల్ వాడి, భగత్ సింగ్ చౌరస్తాల మీదుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు కార్మికులు ఉత్సాహంగా ర్యాలీ చేపట్టారు.
అనంతరం నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ యార్డులు, రైస్ మిల్లులు, బస్ డిపోలతో పాటు వివిధ కార్మిక సంఘాల కార్యాలయాల వద్ద ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాల్లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు టి. చక్రపాణి, హైమది బేగం, భాగ్యలక్ష్మి, కార్యదర్శులు పి. హనుమాన్లు, కవిత, అనిల్, దేవేందర్, ఫెరోజ్ అలీ, భానుచందర్, రాధా కుమార్, అంజయ్య, నరేష్, గోవర్ధన్, ప్రసాద్, నరసయ్య, గణేష్, నవీన్, చిన్ను భాయ్ తదితరులు పాల్గొన్నారు.
